Video: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ కాళ్లు మొక్కిన విరాట్‌ కోహ్లీ!

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. అక్షర్ పటేల్ కీలక వికెట్ తీయడంతో విరాట్ కోహ్లీ షాకింగ్ సెలబ్రేషన్స్ చేశాడు. అక్షర్ పటేల్ కాళ్ళు మొక్కిన సంఘటన సంచలనంగా మారింది. మరి ఇంతకీ కోహ్లీ అలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో బ్లాక్‌క్యాప్స్‌ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌ కంటే ముందు ఇరు జట్లు సెమీస్‌ చేరినప్పటికీ, సెమీస్‌లో ఏ జట్టు ఎవరితో తలపడాలనే క్లారిటీ ఈ మ్యాచ్‌తోనే వస్తుండటంతో అందరిలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 249 పరుగులు మాత్రమే చేసినా, 250 టార్గెట్‌ను కాపాడుకోగలిగింది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. సెమీస్‌కి ముందు పూర్తి ఆత్మవిశ్వాసం పొందారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌, ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌ విరాట్‌ కోహ్లీ.. ఆశ్చర్యకరంగా అక్షర్‌ పటేల్‌ కాళ్లుమొక్కాడు. ఈ ఊహించని ఘటనతో అక్షర్‌ పటేల్‌ కోహ్లీని ఆపే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కొద్ది సేపు పగలబడి నవ్వుకున్నారు. అక్షర్‌ ఎంత ఆపేందుకు ప్రయత్నించినా.. కోహ్లీ అతని కాళ్లను మాత్రం తాకాడు. అయితే.. కోహ్లీ, ఎందుకు అక్షర్‌ కాళ్లు మొక్కాడంటే.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కేవలం 250 పరుగుల టార్గెట్‌ను మాత్రమే చేజ్‌ చేస్తుంది. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌ క్రీజ్‌లో పాతుకుపోయాడు. 81 పరుగులతో మ్యాచ్‌ను లాక్కునే దిశగా వెళ్తున్నాడు. అతను క్రీజ్‌లో ఉన్నంత సేపు న్యూజిలాండ్‌కు మ్యాచ్‌పై ఆశలు ఉన్నాయి. అయితే అలా క్రీజ్‌లో పాతుకుపోయి బ్యాటింగ్‌ చేస్తున్న విలియమ్సన్‌ను అక్షర్‌ పటేల్‌ బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్‌ ఆసాంతం ఎక్కడా చిన్న తప్పు చేయని విలియమ్సన్‌ను.. ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌ చివరి బంతికి అక్షర్‌ మ్యాజిక్‌ చేశాడు. అక్షర్‌ వేసిన బాల్‌ను అంచనా వేయడంలో పూర్తిగా విఫలం అయిన కేన్‌ మామ.. ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో పూర్తిగా బీట్‌ అయ్యాడు. దాంతో క్రీజ్‌ వదిలి చాలా ముందుకు వచ్చేశాడు. బాల్‌ వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ చేతుల్లో పడింది. చాలా కూల్‌గా టైమ్‌ తీసుకొని మరీ కేఎల్‌ స్టంపింగ్‌ పూర్తి చేశాడు. దీంతో విలియమ్సన్‌ పోరాటానికి తెరపడింది. ఈ వికెట్‌ మ్యాచ్‌లో మేజర్‌ టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. విలియమ్సన్‌ వికెట్‌తో మ్యాచ్‌ పూర్తిగా టీమిండియా కంట్రోల్‌లోకి వచ్చేసింది. అంత సేపు విసిగిస్తున్న విలియమ్సన్‌ను అవుట్‌ చేయడంతో అక్షర్‌ పటేల్‌ను కోహ్లీ ఈ విధంగా సరదాగా కాళ్లుమొక్కి అభినందించాడు.