Telangana: ముమ్మరంగా సమగ్ర కుటుంబ సర్వే.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇళ్లలో పూర్తయ్యిందంటే?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సర్వే వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముమ్మరంగా సాగుతోంది. ఈ సర్వే ఈ నెల 6వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నవంబర్ 6 నుంచి 8 వరకు ఎన్యుమరేటర్లు వారి బ్లాకుల్లోని ఇళ్లను సందర్శించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. నవంబర్ 9వ తేదీ నుండి వారు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత వివరాలను ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే సజావుగా సాగేందుకు, మూడు సర్కిళ్లకు ఒక్కొక్క నోడల్ అధికారి నియమితులయ్యారు. వారీ తో పాటుగా జోనల్ కమిషనర్లు మానిటరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే లో తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కోడింగ్ ప్రక్రియ నమోదుకు అవసరమైన సూచనలు అక్కడిక్కడే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం 149073 కుటుంబాలు సర్వే పూర్తి కాగా, ఇప్పటి వరకు మొత్తం .841256.. కుటుంబాల వివరాలు సర్వే చేయబడ్డాయి.