Kuppam: ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం
ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి చెందబోతోంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కొత్త రెక్కలు తొడుక్కోబోతోంది. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతిలో మైలురాయిగా నిలవబోతోంది. ఇంతకీ అంత గొప్పగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? కొత్త రెక్కలు తొడుక్కోబోతున్న కుప్పం నియోజకవర్గం తాలూకా డీటేల్స్ తెలుసుకుందాం పదండి... కుప్పం.. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆరేళ్ల క్రితం భూమి పూజ జరిగినా.. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కుప్పం ఎయిర్ పోర్టు నిర్మాణం ఇప్పుడు ఊపందుకోబోతోంది. కుప్పం ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి కార్గో ఎయిర్ పోర్ట్ అవసరమని 2014 నుంచి 2019 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం నిర్మాణ చర్యలు కూడా చేపట్టింది. ఇందులో భాగంగానే రామకుప్పం, శాంతిపురం మండలాలకు మధ్యలో ఉన్న విజాలాపురం దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2018 సెప్టెంబర్లో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కడిసినకుప్పం, కిలాకపోడు, మనీంద్రం గ్రామాల్లో 395 ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. మరో 100 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేటాయించింది. అయితే 2019లో రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో కుప్పం ఎయిర్పోర్ట్ అంశం అటకెక్కింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్.. కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో మళ్లీ కదలిక వచ్చింది. గతంలో నిర్మించదలచిన కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్ పోర్ట్ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో 1005 ఎకరాలను సేకరించే పని ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆంధ్ర ప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేఖ రాసింది. రామకుప్పం మండలంలోని కిలాకపోడు, మనీంద్రం, విజలాపురం గ్రామాల పరిధిలో ఉన్న భూములను అప్పగించాలని కోరింది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించడం కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం సర్వే పూర్తి చేసింది. గుర్తించిన భూముల కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. త్వరలోనే సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగబోతోంది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అనుసంధానంగా కుప్పం ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకువచ్చి.. శాటిలైట్ సిటీగా కుప్పంను మార్చాలని ప్రయత్నిస్తోంది. లాజిస్టిక్ హబ్ గా కుప్పంను మార్చి కార్గో విమానాల ట్రాఫిక్ను పెంచి కుప్పంను వేగంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827