రంగంలోకి కేసీఆర్, టార్గెట్ రేవంత్ - కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తవుతు న్న వేళ.. తన రాజకీయ ప్రణాళికలతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సమరానికి కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. రానున్న రోజుల్లో జిల్లాల పర్యటనకు కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో, ఈ రోజు కేసీఆర్ చేసే రాజకీయ ప్రకటన పైన ఆసక్తి నెలకొంది. రంగంలోకి కేసీఆర్ ఈ రోజు బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం కానుంది. కీలక నిర్ణయాలకు ఈ సమావేశం వేదికగా నిలవనుంది. సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 24 వసంతాలు పూర్తిచేసుకోనుంది. పాతికేళ్లవేళ రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఖరారే ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు తో పాటు సంస్థాగత కమిటీలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం నేతలు చాలా కాలంగా ఎదురుచూ స్తు న్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. టార్గెట్ రేవంత్ కేసీఆర్ ఫాం హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ లేదా బహిరంగ సభ నిర్వహణ విషయమై నిర్ణయం ప్రకటించే అవ కాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుండటంతో.. ఇక రేవంత్ పాలనా లోపాల పైన నిరసనలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు, హామీల అమలుకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. కార్యాచరణ ఖరారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దామని గతంలోనే కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. ఇప్పుడు ఆ సమయం ముగియటంతో ఇక ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా నిర్వహించేలా కొత్త కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేలా కేసీఆర్ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఖరారు చేయనున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశం అవుతున్న కేసీఆర్ ఎలాంటి మార్గనిర్దేశం చేస్తారన్న ఆసక్తి రాజకీయంగా కొనసాగుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన జరుగుతున్న న్యాయ పోరాటం..వారి విషయంలో అంచనాలను కేసీఆర్ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827