CM Revanth Reddy: హాస్టళ్లలో ఫుడ్పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించామని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకే హాస్టల్లో రెండు మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాల్లలో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి అలసత్వం పనికిరాదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు తరచూ పాఠశాలల, వసతిగృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వ విద్యాసంస్థల్లో జరగుతున్న పొరపాట్లపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాశీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే, వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించామని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విద్యార్థుల విషయంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వసతిగృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో పాటు లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827