AP Assembly Sessions: మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ వ్యూహం ఇదేనా…
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. కూటమి బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఉండబోతోంది.? ఈ సమావేశాల విషయంలో వైసీపీ వ్యూహమేంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బడ్జెట్ను కేబినెట్ ఆమోదించనుంది. ఆ తర్వాత 10గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. 11 గంటలకు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇక మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత.. స్పీకర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలను బీఏసీలో నిర్ణయిస్తారు. అయితే పది రోజుల పాటు సభను నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం. అప్పులు, ఆదాయ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? సూపర్ సిక్స్తో పాటు పలు కీలక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్లో అప్పులు, ఆదాయ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతోంది? అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్లకు ఎంత మేరకు నిధులు కేటాయించబోతుందనేది ఆసక్తిగా మారింది. అసెంబ్లీకి హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం మరోవైపు ఈ సమావేశాలకు వైసీపీ హాజరుకావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు, మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ప్రజల తరపున మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అంటున్నారు మాజీ సీఎం జగన్. జగన్ వ్యాఖ్యలకు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. బాధ్యత ఉంటే సభకు వస్తారన్నారు ఆమె. మైక్ ఇస్తేనే వస్తా.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అని ఎవరూ అనరన్నారు. అయితే మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉండడంతో పాటు అక్కడ సంఖ్యాపరంగా వైసీపీకి ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ముందుకు పలు కీలక బిల్లులు ఇక వైసీపీ వచ్చినా.. రాకపోయినా సభా సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పలు కీలక బిల్లులను అసెంబ్లీ ముందుకు తెచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంశంతో పాటు అనేక అంశాలు.. కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్ట్లపై సభలో చర్చించే ఆలోచనలో ఉంది కూటమి సర్కార్. అదే సమయంలో కొత్త ఎక్సైజ్ పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక పాలసీ సహా పలు పాలసీలు, బిల్లులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827